కలం కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో అనుమతులు లేకుండా ఫైనాన్స్ చేస్తూ, అధిక వడ్డీలతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బి.గితే హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీసులు 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై ఆరు కేసులు నమోదు చేశారు. రూ.1,39,65,000 విలువ గల వివిధ డాక్యుమెంట్లతో పాటు 1,77,000 విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
సమాచారం ఇవ్వాలని ఎస్పీ పిలుపు..
ఈ సందర్భంగా ఎస్పీ మహేశ్ బి.గితే మాట్లాడుతూ.. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్నట్లు వివరించారు. దీంతో అధిక వడ్డీలకు అప్పు చేసి ఆ తరువాత అప్పులు, అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని ప్రజలను కోరారు. అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో లేదా తనకు సమాచారం ఇవ్వొచ్చన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అధిక వడ్డీ రేట్లతో సామాన్యులపై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

