epaper
Wednesday, March 4, 2026
epaper

పాక్ ఆటగాళ్లపై భారీ జరిమానా.. షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌ (T20 World Cup)లో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్థాన్ ఆటగాళ్లపై జరిమానాల పర్వం కొనసాగుతోంది. టీ20 వరల్డ్ కప్‌లో జట్టు చూపించిన ప్రదర్శనకుగానూ పీసీబీ ప్లేయర్లకు రూ.50లక్షలు (పాకిస్థాన్ రూపాయలు) జరిమానా విధించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ అంశంపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది. భారత్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత, జట్టులోని ప్రతి ఆటగాడికి పీసీబీ సుమారు 50 లక్షల రూపాయల (5 మిలియన్ పీకేఆర్) జరిమానా విధించింది. ఒకవేళ జట్టు సెమీస్ చేరి ఉంటే ఈ జరిమానా రద్దయ్యేది.

కానీ సూపర్ 8 దశలో ఇంగ్లాండ్‌తో ఓడిపోవడంతో పాటు, ఇతర సమీకరణాలు కలిసి రాకపోవడంతో పాక్ టోర్నీ నుండి నిష్క్రమించింది. వరుసగా నాలుగోసారి ఐసీసీ మెగా ఈవెంట్లలో పాక్ సెమీస్ చేరకపోవడం ఇదే తొలిసారి.ఈ జరిమానాలపై షాహిద్ అఫ్రిది స్పందిస్తూ, బోర్డు చాలా చిన్నగా ఆలోచిస్తోందని విమర్శించారు. కేవలం డబ్బులు వసూలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఆడని ఆటగాళ్లను దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు పంపాలని సూచించారు. కొందరు ఆటగాళ్లకైతే కనీసం రెండేళ్ల పాటు విశ్రాంతి ఇచ్చి, జట్టులోకి తీసుకోకుండా ఉండటమే సరైన శిక్ష అని అఫ్రిది పేర్కొన్నారు.

జట్టులో మార్పులు చేయడం, ఆటగాళ్ల పనిభారాన్ని నిర్వహించడం ముఖ్యం కానీ, కేవలం జరిమానాలపై ఆధారపడకూడదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ జరిమానాలపై పీసీబీ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదని అఫ్రిది గుర్తు చేశారు. క్రమశిక్షణా రాహిత్యం వల్ల కాకుండా, కేవలం ఆటతీరు బాగోలేదని జరిమానా విధించడం క్రికెట్ చరిత్రలో చాలా అరుదు. గతంలో ఆసియా కప్ ఓటమి తర్వాత కూడా ప్లేయర్ల ఎన్ఓసీలను బోర్డు రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. జట్టు మొత్తం విఫలమైనా, సాహిబ్జాదా ఫర్హాన్ ఒకే ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు బాది రికార్డు సృష్టించడం గమనార్హం. ప్రస్తుతం బోర్డు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పాక్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!