కలం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్ని రకాల ఆందోళనలు చేస్తున్నా ప్రజాదరణ రావడంలేదన్నది బీఆర్ఎస్ (BRS) నాయకుల అభిప్రాయం. ఎన్నికల హామీల్లో కొన్నింటిని అమలు చేయనందుకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా అది బీఆర్ఎస్కు అనుకూలంగా మారడంలేదనే భావన బలపడుతున్నది. ఇప్పుడున్న పరిస్థితులు ఇదే తరహాలో కొనసాగితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఢీకొట్టలేమనే అభిప్రాయానికి వచ్చారు కొందరు. ఇదే అంశాన్ని ఇటీవల పలువురు సీనియర్ నాయకులతో కేసీఆర్ (KCR) తన ఫామ్ హౌజ్లో జరిపిన చర్చల సందర్భంగా ప్రస్తావించినట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం. హామీల్లో కొన్నింటినీ ప్రభుత్వం ఇప్పటివరకూ టచ్ చేయకపోయినా ఎన్నికల నాటికి సంతృప్తికరమైన స్థాయిలో అమలు చేస్తుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ వెల్లడించినట్లు తెలిసింది. నిత్యం ఆందోళనలతో జనంలో ఉంటున్నప్పటికీ రెండేండ్లలో గుణాత్మకమైన తీరులో బీఆర్ఎస్కు పాజిటివ్ వైబ్రేషన్ రాలేదన్నది నేతల అభిప్రాయం. దీంతో తదుపరి స్ట్రాటెజీ ఎలా ఉండాలన్న చర్చ మొదలైంది.
బీఆర్ఎస్ ఫస్ట్ టర్మును తలదన్నేలా.. :
కాంగ్రెస్ (Congress) పార్టీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్న అభిప్రాయాలు బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల తీరుకు ఇప్పుడున్న ప్రభుత్వానికి మధ్య చాలా తేడా ఉన్నదనే అభిప్రాయం కూడా గులాబీ నేతల్లో వ్యక్తమైంది. ఆ కారణంగానే కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ తెలంగాణలో మాత్రం ఒక వ్యక్తి కేంద్రీకృతంగా నడుస్తున్నదని, ఈ విషయాన్ని మరవొద్దంటూ సీనియర్ నేతలకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. మరోసారి అధికారంలోకి రావడానికి అది అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తుందని, బీఆర్ఎస్ ఫస్ట్ టర్ములో అమలు చేసిన తరహాలోనే సంక్షేమ పథకాలతో చివరి సంవత్సరంలో ప్రజలకు దగ్గరవుతుందని నొక్కిచెప్పినట్లు సమాచారం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో బలమైన అసంతృప్తి మొదలై అది వ్యతిరేకతగా మారి ఒక వేవ్లాగా వస్తే తప్ప బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుకోవడం కష్టమనేది కొందరు గులాబీ లీడర్లలో తాజాగా నెలకొన్న అభిప్రాయం.
గులాబీ నేతల అరెస్టుపై భిన్నాభిప్రాయాలు :
గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న కొన్ని అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన, ప్రజాధనం దుర్వినియోగం తదితర అంశాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి తదితరులపై ఆరోపణలు వచ్చాయి. ఏ సమయంలోనైనా వీరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ (BRS) కేడర్లో ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కానీ ఆ పార్టీ లీడర్లలో మాత్రం అరెస్టులు జరిగితే అది ప్రభుత్వానికి ప్రతికూలంగా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతుందనే అభిప్రాయం వినిపిస్తున్నది. అరెస్టులపై ప్రభుత్వానికి సైతం స్పష్టమైన అభిప్రాయం ఉన్నదని, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనే లేదన్నది కాంగ్రెస్ లీడర్ల వివరణ. అరెస్టు కోసం కేటీఆర్ (KTR), హరీశ్రావు (Harish Rao) ఎదురుచూస్తున్నారని, ఎవరు ముందు అరెస్టవుతారోనని ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని, రాజకీయ అస్త్రంగా మల్చుకోడానికి ఆరాట పడుతున్నారని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) ఇటీవల పలుమార్లు సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.
Read Also: ఫుల్టైమ్ డీజీపీ ఎవరు? రేస్లో సీవీ ఆనంద్, శిఖా గోయల్..
Follow Us On : WhatsApp

