కలం, స్పోర్ట్స్ : ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi) మరోసారి నిరాశే ఎదురైంది. తొలి మ్యాచ్లో (India vs Ireland) భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైనప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. బదులుగా సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. టాస్కు కొద్ది నిమిషాల ముందు ఇద్దరికీ భారత క్యాప్లు అందజేశారు. బెల్ఫాస్ట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారత్కు ఎంతో కీలకంగా మారింది.
తొలి టీ20లో 34 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు.. ఇప్పుడు సిరీస్ను 1-1తో సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. మొదటి మ్యాచ్లో 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 148 పరుగులకే ఆలౌటైంది. ముఖ్యంగా స్టార్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలం కావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. అదే మ్యాచ్ శ్రేయస్ అయ్యర్కు 963 రోజుల తర్వాత టీ20 జట్టులో పునరాగమనం కాగా, పూర్తి స్థాయి టీ20 కెప్టెన్గా తొలి మ్యాచ్ కూడా అదే. అయితే ఆ ఆరంభం ఆశించిన విధంగా సాగలేదు.
తొలి మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించినా, రెండో మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)కి అవకాశం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ మాత్రం భారత జెర్సీలో తమ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయడంపై టీమిండియా దృష్టి పెట్టింది. మరోవైపు అరంగేట్రం చేస్తున్న ఇద్దరు యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారనే ఆసక్తి కూడా నెలకొంది.

