కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా వాసి దుబాయ్ (Dubai) లో తప్పిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ కు చెందిన జంగం రాజన్న (48) (Jangam Rajanna) 15 రోజుల క్రితం జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే కంపెనీ రూమ్ నుంచి బయటికి వెళ్లిన రాజన్న తిరిగి మళ్లీ రూమ్ కు రాలేదని నిర్మల్ జిల్లాకు చెందిన తోటి కార్మికుడు రాజన్న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
దీంతో తండ్రిని వెతికేందుకు పెద్ద కొడుకు రమేశ్ మే 22వ తేదీన దుబాయ్ వెళ్లాడు. ఇప్పటివరకు తన తండ్రి జాడ దొరక్కపోవడంతో రాజన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రాజన్న జాడను తెలుసుకొని స్వగ్రామానికి రప్పించాలని భార్య అనిత, చిన్న కొడుకు రిషి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాగా రాజన్నది పేద కుటుంబం అని, ఊరిలో డప్పు కొడుతూ ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించే వాడని స్థానికులు తెలిపారు.

