కలం, నిజామాబాద్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ (West Bengal) ప్రజలు మార్పు కోరుకున్నారని, మమతా బెనర్జీ అరాచక పాలనపై అసంతృప్తితో బీజేపీకి మద్దతు తెలిపారని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana) వ్యాఖ్యానించారు. దేశంలోని మూడు రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో సోమవారం నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుందని పేర్కొన్నారు. ఊహించిన దానికంటే భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ ఎన్నికల ద్వారా ప్రజలు అభివృద్ధి, పారదర్శకత, భద్రత కోరుకుంటున్నారని స్పష్టమైందని అన్నారు. ముఖ్యంగా భయం, అవినీతి, అశాంతి పాలనకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన (Dhanpal Suryanarayana) ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ ఫలితాలు దేశ రాజకీయాలకు కొత్త దిశను చూపుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా మార్పు ఖాయమని పేర్కొన్నారు.
ఇది కేవలం ఓటింగ్ మాత్రమే కాదని, ప్రజల ఆలోచనా విధానం మారుతోందనే సంకేతమని తెలిపారు. అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలలో కూడా బీజేపీ విజయాన్ని సాధించిందని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో తన ఉనికిని కోల్పోయిందని విమర్శించారు. అనంతరం టపాసులు పేలుస్తూ, మిఠాయిలు పంచుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: బిడ్డల ఆకలి తీర్చలేని ఓ తండ్రి నిస్సహాయత.. గుండెను పిండేసే దృశ్యం
Follow Us On: X(Twitter)

