కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. ఎండల తీవ్రతతో ఉభయ రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెలంగాణ (Telangana)లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 244 మండలాల్లో వడగాలులు (Heatwave) వీచాయి. తీవ్రమైన వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే 22 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 9 మంది మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏపీ (AP)లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత విపరీతంగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఎండలు, వడగాలుల తీవ్రత నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అధికారులు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు.

