కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రహదారుల నెట్వర్క్లో మరో మైలురాయి చేరబోతోంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషితో దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియలో (Telangana Southern RRR) ముందడుగు పడింది. కోమటిరెడ్డి గతంలో చేసిన ప్రతిపాదనలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ ఆయనకు అధికారిక లేఖ రాశారు.
సదరన్ పార్ట్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ పనుల కోసం ఇప్పటికే ప్రత్యేక కన్సల్టెన్సీని అపాయింట్ చేశామని స్పష్టం చేశారు. నివేదిక తయారీ ప్రక్రియ కొనసాగుతోందని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చిన సానుకూల స్పందన పట్ల మంత్రి కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నందుకు గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘‘శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇది ఒక అద్భుతమైన శుభవార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్మితం కాబోయే ఈ రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయబోతోంది. ఇది తెలంగాణ అభివృద్ధికి నిజమైన ‘గేమ్ చేంజర్’గా నిలుస్తుంది.” అని మంత్రి పేర్కొన్నారు. ఈ రింగ్ రోడ్డు పూర్తయితే రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, శివారు జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి భారీ అవకాశాలు లభిస్తాయన్నారు.
ఉత్తర, దక్షిణ భాగాల అనుసంధానంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను పొందుతాయనీ, ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు.

