కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా గుర్తించిన 108 పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) అందజేశారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. మొబైల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. www.ceir.gov.in ద్వారా ఫిర్యాదు చేసి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు.
జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.2 కోట్ల 70 లక్షల విలువైన 2,250 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ వెల్లడించారు. అలాగే సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో అవి చోరీకి గురైనవో కాదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలన్నారు. అనుమానాస్పద మొబైల్ ఫోన్ల కొనుగోలుకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రజల ఆస్తుల రక్షణకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు.

