కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal)లో నాన్ డ్యూటీ లిక్కర్ కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం దిగుమతి చేసి విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మందుబాబులను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమార్కులు హర్యానా, గోవా రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో మద్యం తెచ్చి తక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారుతుండగా, అక్రమ విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ధాబాలు, ఫంక్షన్ హాళ్లు, బ్యాంకెట్ హాళ్లను కేంద్రంగా చేసుకుని ఈ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం.
ప్రత్యేక దాడుల్లో భారీ మద్యం స్వాధీనం
నిర్మల్ ఎక్సైజ్ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో గత పది రోజులుగా గాజులపేట్, ఎల్లంపల్లి, ప్రియదర్శనగర్, అడెల్లి పోచమ్మ దేవాలయం పరిసరాలు, పలు ధాబాలు, ఫంక్షన్ హాళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో హర్యానాకు చెందిన నాన్ డ్యూటీ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా, నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 44పై ఉన్న “సింగ్ ఈజ్ కింగ్” దాబా యజమాని గుర్మిత్ సింగ్ అలియాస్ కాల సింగ్పై తెలంగాణ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం శిక్షార్హమని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. అలాగే వివాహాలు, శుభకార్యాలు, వేడుకల్లో మద్యం వినియోగించాలనుకుంటే తప్పనిసరిగా ఎక్సైజ్ శాఖ నుంచి ఈవెంట్ పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.

