కలం, కరీంనగర్ బ్యూరో: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయంలో విధుల నిర్వహణ విమర్శలకు తావిస్తోంది. ఆలయ ఈవో అంజనా రెడ్డి వ్యక్తిగత కారు డ్రైవర్.. ఆలయ ఉద్యోగిలా టికెట్ క్యాష్ కౌంటర్ వద్ద దర్జాగా విధులు నిర్వహిస్తుండటంపై భక్తులు మండిపడుతున్నారు. నిత్యం వేలాది రూపాయల లావాదేవీలు జరిగే కీలకమైన కౌంటర్ వద్ద అనధికార వ్యక్తిని నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సదరు వ్యక్తిని ప్రశ్నించగా.. ఈవో ఆదేశాల మేరకే తాను ఇక్కడ పనిచేస్తున్నట్లు చెప్పడం గమనార్హం. కౌంటర్ విధులే కాకుండా కింది స్థాయి ఆలయ ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా కౌంటర్ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు అతడికి సహకరిస్తున్న అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

