కలం, నిర్మల్ : జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి అర్హత ఓటరు జూలై 24లోగా తమ వివరాలను నమోదు చేసి ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సమర్పించాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి పురోగతిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ కార్యక్రమం జూలై 24 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటర్ల వివరాల సేకరణ, సవరణ, అనుసంధాన ప్రక్రియను విస్తృతంగా చేపడుతున్నట్లు చెప్పారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి రెండు ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని తెలిపారు.
ప్రజలు ఫారాలను పూర్తిగా పూరించి, 2002 ఓటర్ల జాబితాలో తమ పేరు లేదా తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మ, నానమ్మ తదితర కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించి, సంబంధిత సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలని సూచించారు. అనంతరం సంతకం చేసి, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోను జతచేసి సంబంధిత బీఎల్ఓకు అందజేయాలని తెలిపారు. ఒక ప్రతిని బీఎల్ఓ వద్ద ఉంచుకుని, మరో ప్రతిని ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఓటర్లు తమ వివరాలను బీఎల్ఓలను సంప్రదించడం ద్వారా లేదా voters.eci.gov.in వెబ్సైట్లో “Search by Electoral” ఎంపిక ద్వారా సులభంగా పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన ప్రతి ఓటరు ఓటు భద్రంగా ఉంటుందని, ఫారాలు సమర్పించని వారి వివరాలు మాత్రమే తదుపరి పరిశీలనకు లోబడే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి పౌరుని బాధ్యత అని పేర్కొంటూ, జిల్లాలోని ప్రతి ఓటరు జూలై 24లోగా తమ వివరాలను నమోదు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

