కలం, వెబ్డెస్క్: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ (Satwik Sairaj), చిరాగ్ శెట్టి (Chirag Shetty) దేశంలో బ్యాడ్మింటన్కు లభిస్తున్న గుర్తింపుపై ఆవేదన వ్యక్తం చేశారు. థాయ్లాండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్కు చేరిన సందర్భంగా మాట్లాడిన ఈ స్టార్ జోడీ.. 2022లో భారత్ తొలిసారి థామస్ కప్ గెలిచినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని గుర్తుచేసింది. ఈ ఏడాది కాంస్య పతకం సాధించిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదని పేర్కొంది. తాము చేసిన వ్యాఖ్యలు విమర్శల కోసం కాదని, దేశంలో బ్యాడ్మింటన్ గురించి మరింత చర్చ జరగాలన్నదే ఉద్దేశమని స్పష్టం చేసింది.
భారత్ చారిత్రాత్మక విజయం సాధించినప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరగాల్సిందని చిరాగ్ శెట్టి అభిప్రాయపడ్డారు. కానీ కనీస సంబరాలు కూడా జరగకపోవడం చాలా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యాఖ్యలపై కొందరు విమర్శించినా, ఎక్కువ మంది సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు సాత్విక్ సాయిరాజ్ మాట్లాడుతూ.. తాము ఇండియా జెర్సీతో దేశం కోసం ఆడుతున్నప్పటికీ, ప్రజల దృష్టి ఎక్కువగా ఐపీఎల్ వంటి ఈవెంట్లపైనే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. థామస్ కప్ వంటి టోర్నీల్లో పతకం గెలవడం ఎంత కష్టమో చాలామందికి తెలియడం లేదన్నారు.
బ్యాడ్మింటన్ వ్యక్తిగత క్రీడ అయినప్పటికీ, జట్టుగా ఆడే థామస్ కప్ వంటి టోర్నీలకు ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుందని చిరాగ్ చెప్పారు. ఇలాంటి ఈవెంట్లు ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని తెలిపారు. త్వరలో జరిగే ఆసియా క్రీడల్లో కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ స్టార్ జోడీ వెల్లడించింది. భారత బ్యాడ్మింటన్కు మరింత ఆదరణ, ఆటగాళ్లకు తగిన గుర్తింపు రావాలన్న చర్చ ఇప్పుడు మరింత బలపడుతోంది.

