కలం, వలిగొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భువనగిరి (Bhuvanagiri) ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Anil Kumar Reddy) అన్నారు. ఆదివారం వలిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో మండల రైస్ మిల్లర్లు, రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, రవాణా, మిల్లింగ్ తదితర అంశాలపై రైతులు, మిల్లర్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ధాన్యం విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని, తూకం, చెల్లింపులు, రవాణా తదితర విషయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. రైతన్నలు దేశానికి, ప్రభుత్వానికి అన్నదాతలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రతి చర్య తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైస్ మిల్లర్లు, రైతులు పాల్గొన్నారు.

