కలం, వెబ్డెస్క్: నేపాల్ వరదల్లో (Nepal Flood) మృతుల సంఖ్య 626కు చేరుకుంది. ఈ వివరాలను నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాకశం ఉంది. సుమారు 2,000 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. నేపాల్లో వచ్చిన ఆకస్మిక వరదల్లో వంతెనలు, ప్రాజెక్టులు, విద్యుత్ వ్యవస్థ, జనావాసాలు భారీ ఎత్తున ధ్వంసమయ్యాయి. నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యధికంగా చిత్రవన్లో 233 మృతదేహాలను వెలికితీశారు. అలాగే నవల్పరాసి తూర్పులో 158, నువాకోట్లో 51, గోర్ఖాలో 48, నవల్పరాసి పశ్చిమలో 47, ధాడింగ్లో 45, తనాహులో 31, రాసువాలో 13 చొప్పున మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు.
బుధవారం నుంచి కొనసాగుతున్న సహాయక చర్యలు నేటితో నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో ఇప్పటి వరకు సుమారు 2,500 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరద నీటి మట్టాలు ఇంకా పెరుగుతుండటంతో మరోసారి ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల కంటే సాంకేతిక రంగాలలో తమ దేశానికి విదేశీ సహాయం అవసరమని నేపాల్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.

