కలం, వెబ్ డెస్క్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సరైన ప్రోటోకాల్ ఇవ్వకపోవడంతో పాటు, తాను కార్యక్రమానికి చేరుకునేలోపే గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా ప్రారంభించడంపై మండిపడ్డారు. బంజారాహిల్స్లోని (Banjara Hills) కొమరం భీమ్ ఆదివాసీ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్యక్రమానికి హాజరయ్యేలోపే అధికారులు లక్కీ డ్రాను ప్రారంభించడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగకుండా లక్కీ డ్రా ఎలా ప్రారంభిస్తారని అధికారులను ఆయన ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ను పాటించలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని దానం నాగేందర్ హెచ్చరించారు. అనంతరం కార్యక్రమం మధ్యలోనే అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో కొద్దిసేపు కార్యక్రమ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

