కలం, వెబ్ డెస్క్ : మే 3న జరిగిన నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు జరగడం, ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేసి ఆదివారం (జూన్ 21) రీ ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ లోనూ భారీ కుంభకోణం (NEET Scam) వెలుగుచూడడం తీవ్ర కలకలం రేపుతోంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ లో నకిలీ అభ్యర్థులతో పరీక్ష రాయించేందుకు ప్రయత్నించిన 30 మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో దేశంలోని ప్రముఖ వైద్య విద్యాసంస్థలకు చెందిన మెడికల్ విద్యార్థులు కూడా ఉండటం కలకలం రేపుతోంది.
ఇందులో భాగంగా బయోమెట్రిక్ వద్ద ఇబ్బంది లేకుండా సిబ్బందితో నకిలీ వ్యక్తులు కుమ్మక్కు అయినట్లు పోలీసులు గుర్తించారు. మోసపూరిత మార్గాల ద్వారా ప్రవేశాలు ఇప్పించడానికి ఒక్కో అభ్యర్ధి నుంచి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు డీల్ కుదిరినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. స్కామ్కి పాల్పడినవాళ్లు సాల్వర్ గ్యాంగ్కి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కాగా, NEET పేపర్ లీక్ అయినప్పుడు కూడా సాల్వర్ గ్యాంగ్పై కేసులు నమోదయ్యాయి. ఈ స్కామ్ లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

