కలం, కరీంనగర్ బ్యూరో: ఆగస్టు 30న జిల్లాలో నిర్వహించనున్న నీట్-పీజీ 2026 పరీక్ష (NEET PG Exam)ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం డీసీపీ రామ్ రెడ్డితో కలిసి పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లిలోని బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా ఏర్పాట్లను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. నీట్-పీజీ 2026 పరీక్ష ఆగస్టు 30న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులను ఉదయం 7:30 గంటల నుంచి 8:45 గంటల వరకు మాత్రమే పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఒరిజినల్ పర్మినెంట్/ప్రొవిజనల్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, దాని స్వీయ ధ్రువీకరించిన జిరాక్స్ కాపీని వెంట తెచ్చుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డును నిర్దేశిత విధంగా ఒకే ఏ4 పేపర్పై కలర్లో బ్యాక్-టు-బ్యాక్ ప్రింట్ చేసుకోవాలని తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీఎన్సీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో హెల్త్ అసిస్టెంట్లను ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్ఓకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, మొబైల్ జామర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి అభ్యర్థికి HHMD, మాన్యువల్ బాడీ ఫ్రిస్కింగ్ నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ ధృవీకరణ, ఫోటో, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఫేస్ కంపారిజన్, బార్కోడ్ స్కానింగ్ వంటి నిర్దేశిత ప్రక్రియలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, గడియారాలు, ఆభరణాలు, షూస్ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు.
పరీక్షా పర్యవేక్షణ కోసం జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్ల తెలిపారు. ప్రశ్నపత్రం ఐదు టైమ్-బౌండ్ సెక్షన్లుగా ఉండి, ఒక్కో సెక్షన్కు 42 నిమిషాల సమయం ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు వాటర్ బాటిల్ అందిస్తామని, రఫ్ షీట్, పెన్ అందించబడవని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందు రిజిస్ట్రేషన్ పూర్తైన అనంతరం అభ్యర్థులకు బయో బ్రేక్లకు అనుమతి ఉండదని తెలిపారు. సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో అమలు చేయాల్సిన అన్ని నిబంధనలను అధికారులు, పరీక్షా సిబ్బంది కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని, పరీక్షా నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య,తహసిల్దార్ రాజయ్య, సుల్తానాబాద్ తహసిల్దార్ బషీరుద్దీన్, రామగిరి తహసిల్దార్ సుమన్, పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

