కలం, నిజామాబాద్ బ్యూరో : యూరియా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓ వైపు యూరియా కొరత లేనే లేదని యాప్లో నమోదు చేసినన్ని యూరియా సంచులు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అలా కనిపించడం లేదు. వరి చివరి దశలో ఉందని 15 రోజులుగా యూరియా (Urea) కోసం ఎదురు చూస్తున్నామని నిజామాబాద్ జిల్లా నందిపేట (Nandipet) మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా నంది పేటలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా(Urea) కోసం రోజులు గంటల తరబడి వేచి చూసినా ఎరువు దొరకడం లేదని రైతులు రాస్తారోకో ద్వారా నిరసన తెలిపారు.
ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యూరియా యాప్ (Urea App) వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అందరికీ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండదని వెంటనే యూరియా యాప్ను రద్దు చేసి, రైతులకు నేరుగా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.


