కలం, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లా చిట్యాల మండలం (Chityala) గుండ్రంపల్లి గ్రామ శివారులో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (Vijayawada-Hyderabad Highway)పై ఆదివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి వరుసగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న ఒక కారు డ్రైవర్ అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న మరో రెండు కార్లు, ఒక బైక్ నియంత్రణ కోల్పోయి ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాద సమయంలో మూడు కార్లలో మొత్తం పదిమంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కార్లు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం రోడ్డుపై అడ్డంగా ఉన్న కార్లను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి, ట్రాఫిక్ను పూర్తిగా క్లియర్ చేశారు.

