కలం, నల్లగొండ: వేసవి తీవ్రత దృష్ట్యా నగర ప్రజలకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు నల్లగొండ (Nalgonda) నగరపాలక సంస్థ కీలక చర్యలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర ఆదేశాల మేరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో షేడ్ నెట్లను ఏర్పాటు చేసే పనులను అధికారులు వేగవంతం చేశారు. నగరంలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎండ తగలకుండా షేడ్ నెట్లను నిర్మిస్తున్నారు. బస్టాండ్, క్లాక్ టవర్, చర్చి, ఎస్బీఐ బ్యాంక్ పరిసరాలు, క్యాంప్ ఆఫీస్, డీఈఓ కార్యాలయం ఎదురుగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఎన్జీ కాలేజ్, డీవీకే రోడ్ బస్ స్టాప్, అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద ఇప్పటికే షేడ్ నెట్ల ఏర్పాటు పూర్తయింది. రామగిరి, గాంధీ పార్క్ సమీపంలో కూడా పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎండల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ బి. శరత్ చంద్ర తెలిపారు. షేడ్ నెట్లతో పాటు, త్వరలోనే నగరవ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు తాగునీటి సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నగరపాలక సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పట్టణ ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

