కలం, నల్లగొండ బ్యూరో: యువత సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ (Nalgonda Mayor) బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక (Praja Palana – Pragati Pranalika) కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్లగొండలోని బాలికల ఐటీసీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరు స్వల్పకాలిక కోర్సులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కింద యువతలో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 6 స్వల్పకాలిక కోర్సులను ప్రారంభించడం అభినందనీయమన్నారు.
రూ. 17 కోట్లతో ఏటీసీ
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం రూ. 17 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) కేంద్రాలను ప్రారంభించారని చెప్పారు. పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యమైనవని, ఇలాంటి స్వల్పకాలిక కోర్సులు విద్య, ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అన్నారు. ఈ కోర్సుల ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యాలు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయినీ, తద్వారా వారు ఉపాధి అవకాశాలను పొందగలుగుతారని అన్నారు. స్వయం ఉపాధిని ప్రారంభిస్తారని తెలిపారు.
36 వేల మందికి శిక్షణ
ఈ స్వల్పకాలిక కోర్సుల ద్వారా 36వేల మంది శిక్షణార్థులకు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభిస్తున్న సీఎన్సీ ఆపరేషన్, రోబోటిక్స్ ప్రోగ్రామింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, క్యాడ్ ప్రొడక్ట్ డిజైన్, సీఎన్సీ మిల్లింగ్, ప్రాసెస్ ఆటోమేషన్ వంటి కోర్సులు ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. కేవలం రెండు వారాల కాలం అయినప్పటికీ ఈ శిక్షణ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై మంచి అవగాహన పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నూతన కోర్సులకు సంబంధించి పోస్టర్లను మేయర్ బుర్రి చైతన్య (Nalgonda Mayor) ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇబ్రహీం, జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ, బాలికల ఐటీఐ ప్రిన్సిపాల్ జంజీరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ .. ఆరుగురు సస్పెండ్
Follow Us On: X(Twitter)

