కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలో రూ. 22 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) తెలిపారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక నల్లగొండ జిల్లా 99 రోజుల కార్యాచరణ (99 Day Action Plan) ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జడ్పీ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. పేదోళ్లు సైతం చదువుకునేలా నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో రూ.220 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్ 9 వీటిని పూర్తి చేస్తామని తెలిపారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ టాక్స్ని వసూలు చేయాలని సూచించారు. చెల్లించే స్థాయి వారి వద్ద నుంచి పూర్తిస్థాయిలో ప్రాపర్టీ టాక్స్ని వసూలు చేయాలని ఆదేశించారు. నల్లగొండ నుంచి గుర్రంపోడు వరకు నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరిస్తున్నామని, అదేవిధంగా కనగల్ నుంచి మాల్ వరకు నాలుగు లైన్ల రోడ్డుకు త్వరలో టెండర్లు పిలుస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. చదువుకునే పిల్లలకు ప్రజాప్రతినిధులు అండగా ఉండాలని, తాను కూడా సాయం చేస్తానని భరోసానిచ్చారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలే మనల్ని గెలిపిస్తాయని, ప్రజలతో విధిగా సమన్వయం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

