కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయం ఇప్పుడు భక్తుల విశేష ఆదరణ పొందుతోంది. దాదాపు 1500 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని హనుమంతుడి విగ్రహం (Hanuman Idol) ఆకాశమే పైకప్పుగా భక్తులకు దర్శనమివ్వడం విశేషం. ఈ స్వామి విగ్రహం ఏటా స్వల్పంగా పెరుగుతోందని, అందుకే ఈ ఆలయానికి పైకప్పు వేయడం సాధ్యం కావడం లేదని స్థానిక అర్చకులు చెబుతున్నారు. హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహ స్వామి ఇక్కడ హనుమంతుడికి దర్శనమిచ్చారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఇక్కడ హనుమ విగ్రహం సుమారు 20 అడుగుల ఎత్తులో, నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి, సాలగ్రామానికి నమస్కరిస్తున్నట్లుగా ఈ విగ్రహం కనిపిస్తుంది.
ఆలయ నిర్మాణం
16వ శతాబ్దంలో రామచంద్ర నాయకర్ నిర్మించిన నామగిరి కోట దిగువన ఈ ఆలయం ఉంది. ఈ కొండరాయితో మలచిన విగ్రహాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ ఆలయానికి పైకప్పు నిర్మించాలని ప్రయత్నించినప్పుడల్లా అది ఏదో ఒక కారణంతో ఆగిపోవడం లేదా కూలిపోవడం జరుగుతుంది.ఈ ఆలయం ఉన్న కొండపై మొత్తం ఎనిమిది కొలనులు ఉన్నాయి. వాటన్నింటిలోనూ తామర పువ్వులు ఉండటం విశేషం. ప్రధాన ఆలయంతో పాటు కొండ గుహలలో నరసింహ స్వామి, రంగనాథ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో రోజుకు నాలుగు సార్లు (కలసంధి, ఉచికల, సాయరక్ష, అర్ధజామ) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి, ప్రతి నెలా పూర్వాభాద్ర నక్షత్రం రోజున వేడుకలు ఘనంగా జరుగుతాయి. చెడు అలవాట్లు, వ్యసనాల నుండి విముక్తి పొందాలనుకునే వారు ఈ స్వామిని దర్శిస్తే మంచి ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.
ఎలా చేరుకోవాలి..?
తమిళనాడులోని నామక్కల్ జిల్లా నుంచి సేలం వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి నామక్కల్కు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భక్తిశ్రద్ధలతో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకు కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతుందని ప్రతీతి. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే వారికి నామక్కల్ హనుమాన్ ఆలయం ఒక ఉత్తమ గమ్యస్థానం.

