కలం, నకిరేకల్: పోలియో రహిత సమాజ నిర్మాణానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) పిలుపునిచ్చారు. ఆదివారం నకిరేకల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తుకు పునాదులైన చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ఐదేళ్లలోపు వయసున్న ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే ఇలాంటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి చిన్నారికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని పోలియో రహితంగా మార్చేందుకు అందరూ సహకరించాలని పేర్కొన్నారు.
ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తల్లులు తమ పిల్లలతో భారీగా తరలివచ్చారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ నియోజకవర్గంలోని ప్రతి చిన్నారికీ డ్రాప్స్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి వైద్య సిబ్బంది, నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

