కలం, నల్లగొండ: బీజేపీ (BJP) రాష్ట్రంలో చేపడుతున్న రైతు యాత్ర కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నల్గొండ (Nalgonda) జిల్లా సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నిర్వహిస్తున్నది రైతు యాత్రనా లేక రాజకీయ యాత్రనా అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ధాన్యాన్ని అత్యంత వేగంగా, పారదర్శకంగా కొనుగోలు చేస్తోందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో రైతుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తోందని తెలిపారు.
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని, నా సొంత నియోజకవర్గమైన నకిరేకల్లోని రెండు మండలాల్లో ఇప్పటికే పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమని, రైతులకు అసలు బీజేపీ ఏం భరోసా ఇస్తోందో స్పష్టం చేయాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తూ, తెలంగాణ రైతుల విషయంలో మాత్రం తీవ్ర వివక్ష చూపుతోందని వేముల వీరేశం విమర్శించారు.
తెలంగాణ అభివృద్ధిపై బీజేపీకి అస్సలు చిత్తశుద్ధి లేదని, రాష్ట్రం నుండి 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, వారు రాష్ట్రానికి సాధించింది శూన్యమని ఎద్దేవా చేశారు. రైతుల పేరుతో బీజేపీ చేస్తున్న డ్రామాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, నిరంతరం రైతు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు పూర్తి మద్దతుగా నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు.

