కలం, కేతేపల్లి : రైతాంగ సంక్షేమం, పేదల జీవనోపాధి మెరుగుపరచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. నల్గొండ (Nalgonda) జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వల ద్వారా దిగువకు నీటిని వదిలి, సాగునీటి సరఫరాను ఆయన అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మూసీ ప్రాజెక్టు నీటి విడుదలతో వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనివల్ల ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, పంటలకు సమయానికి సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రైతులు ఆనందంగా, ధీమాగా వ్యవసాయం చేసుకునేలా అనుకూల పరిస్థితులను కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత పదేళ్ల పాలనలో పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు.
అర్హులైన పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు అందకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని ఆయన భరోసా ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు ఖచ్చితంగా చేరేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నీటిపారుదల శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

