కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర శివారులోని రోడ్లపై పోకిరీలు రెచ్చిపోతున్నారు. కార్లు, బైక్లపై వెళ్లే వాళ్లను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ కుటుంబసభ్యులతో వెళ్లే వాళ్లు ఈ హంగామాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రాత్రి కొందరు పోకిరీలు బోడుప్పల్-ఘట్కేసర్ (Ghatkesar) హైవేపై ఓ ఫ్యామిలీని బైక్పై వెంబడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కారులో ఆడ వాళ్లు ఉన్నారని తెలుసుకున్న పోకిరీలు మరింత బీభత్సం సృష్టించారు. బూతులు మాట్లాడుతూ, చెప్పు చూపిస్తూ హద్దులు మీరి ప్రవర్తించారు. ఈ క్రమంలో కారులో ఉన్న ఆడవాళ్లు భయంతో ఏడుస్తూ వీడియో రికార్డు చేశారు.
అయినా సదరు యువకులు మరింత రెచ్చిపోయి, వాహనానికి అడ్డంగా బైక్లను తిప్పుతూ, కేకలు వేస్తూ వీరంగం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడిరోడ్డుపై కుటుంబంతో వెళ్తున్న వారిని ఇంతలా వేధిస్తున్నా పట్టించుకునేవారే లేరా అని మండిపడుతున్నారు. నగర శివార్లలో అర్ధరాత్రి వేళల్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని, ఇలాంటి ఆకతాయిలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

