కలం, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao) మృతిపై జనసేన అధినేత, ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని పేర్కొన్నారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకు ఉన్న పరిజ్ఞానం ఎంతో విలువైనదని తెలిపారు. నాదెండ్ల భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అలాగే తన సహచర మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పితృ వియోగం బాధ నుంచి త్వరగా కోలుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా మనోహర్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు.
మరోవైపు నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) సంతాపం తెలిపారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్కు ఫోన్ చేసి పరామర్శించారు. నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కాగా, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం నాదెండ్ల భాస్కరరావు (Nadendla Bhaskara Rao) మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
Read Also: ప్రకాశ్ రాజ్ను చంపేయండి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

