కలం, వెబ్ డెస్క్ : మూసీ ప్రాజెక్టు తొలి దశ డీపీఆర్ తయారైందని ఐటీ మంత్రి శ్రీధర్బాబు (Sridhar Babu) అసెంబ్లీలో స్పష్టం చేశారు. తొలి దశ డీపీఆర్ ఖర్చు రూ.6,500 నుంచి 7000 కోట్లు అవుతుందని చెప్పారు. మూసీ పునర్నిర్మాణంలో 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. తుది ఎన్యూమరేషన్ కొనసాగుతుందన్నారు. బఫర్జోన్లో ఉన్నవారికి టీడీఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం ఉంటుందని తెలిపారు. తాము కొత్తగా బఫర్జోన్ నిర్ణయించలేదని.. 2024 డిసెంబర్లో మెయిన్హార్ట్కు డీపీఆర్ బాధ్యతలు అప్పగించామన్నారు. 2026 ఫిబ్రవరిలో మెయిన్హార్ట్ సంస్థ డీపీఆర్ అప్పగించిందన్నారు. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు మూసీ డీపీఆర్ రెండు నెలల్లో పూర్తి కాలేదని చెప్పారు.
వచ్చే ఏడీబీ బోర్డు మీటింగ్లో మూసీ ప్రాజెక్టుకు అనుమతి లభించే అవకాశం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ఆపేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుందని విమర్శించారు. ప్రాజెక్టులను తాము నిలిపేసినట్లు బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మంత్రి శ్రీధర్బాబు సమాధానం ఎవరికీ సంతృప్తిగా లేదని అన్నారు. మూసీ ప్రాజెక్టు తొలి దశ రూ.7 వేల కోట్లు అన్నారని.. ఇంకా ఎన్ని దశలు ఉంటాయి? అని ఫైర్ అయ్యారు. రూ.16 వేల కోట్లయ్యే ప్రాజెక్టుకు సీఎం లక్షన్నర కోట్లు అని చెబుతున్నారని ఆగ్రహించారు.

