కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరో భారీ పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తన తొలి మ్యాచ్ను రేపు (శనివారం) ఆడనుండటంతో అభిమానుల ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది. సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుక కోసం నగరంలోని క్రికెట్ ప్రేమికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మ్యాచ్ సందర్భంగా ధోనిపై తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఫ్యాన్స్ ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. స్టేడియం మొత్తాన్ని పసుపు రంగుతో నింపేయాలని, ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగస్వాములు కావాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ధోని (MS Dhoni) బ్యాటింగ్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి అభిమానులు తరలివస్తుండటంతో ఉప్పల్ పరిసర ప్రాంతాలు సందడిగా మారనున్నాయి. ఈ సీజన్లో ధోని మొదటి మ్యాచ్ కావడంతో రికార్డు స్థాయిలో జనం హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

