కలం, నల్లగొండ బ్యూరో: బీబీనగర్ ఎయిమ్స్ (Bibinagar AIIMS) ఆస్పత్రి సేవలను 2026 నాటికి ప్రజలకు అందుబాటులోకి రావాలని భువనగిరి ఎంపీ చామల (MP Chamala) కిరణ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఎయిమ్స్ ప్రాంగణంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవన నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యంపై ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే భవన నిర్మాణాలు రెండేండ్లు ఆలస్యమయ్యాయని, ఇంకా ఎంతకాలం సాగదీస్తారని కాంట్రాక్టర్లను, కన్సల్టెంట్లను ఎంపీ నిలదీశారు. నిర్ణీత క్యాలెండర్ ప్రకారం పనులు పూర్తి చేసి అప్పగించాలని స్పష్టం చేశారు.
నిర్మాణ వేగాన్ని పెంచేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, రాత్రింబవళ్లు పనులు చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైద్య సేవలు విస్తరించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న రెండు డయాలసిస్ మిషన్లు సరిపోవని, తక్షణమే మరో 25 కొత్త డయాలసిస్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ ఆదేశించారు.
ఆస్పత్రికి అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక వసతులపై సమగ్ర రిపోర్టు అందజేయాలని అధికారులను కోరారు. ఎయిమ్స్ ఉద్యోగ నియామకాలపై ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎయిమ్స్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో 25 శాతం కోటాను ఖచ్చితంగా స్థానికులకే కేటాయించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.


