కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న విషప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక సీఎం రేవంత్ రెడ్డి కుట్ర ఉందంటూ ‘తెలుగు స్క్రైబ్’ తో పాటు కొన్ని సోషల్ మీడియా హ్యాండిళ్లు అసత్య ప్రచారానికి తెరలేపాయని ఆయన మండిపడ్డారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి సమగ్ర దర్యాప్తు జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన అధికారులను కోరారు. విమర్శల పేరుతో అబద్ధాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూసే వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

