కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు (Chittoor) జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు చిన్నారుల హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని తన ఇద్దరు చిన్నారులను హత్య చేసిన కేసులో తల్లి పవిత్రకు జీవిత ఖైదు విధించింది. ఈ దారుణ ఘటన 2017లో రామకుప్పం (Ramakuppam) మండలం కవ్వంపల్లిలో చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ వేమన్నతో ఏర్పడిన వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని విచారణలో తేలింది.
6, 3 ఏళ్ల వయసున్న తన ఇద్దరు కుమారులను అంగన్వాడీ నుంచి తీసుకొచ్చిన తర్వాత, ఒకే నైలాన్ తాడుతో వారి మెడలను కట్టేసి ఫ్యాన్కు ఉరివేసి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. సుదీర్ఘ విచారణ అనంతరం చిత్తూరు జిల్లా 9వ అదనపు జడ్జ్ ఎన్. శ్రీనివాసరావు నిందితురాలు పవిత్రకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, కోర్టు తీర్పుతో కేసుకు ముగింపు లభించింది.

