కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) ఓ మహిళ వైరల్ వీడియో కోసం తన బిడ్డను స్కూటీ డిక్కీలో పెట్టి డ్రైవ్ చేసిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. జహర్ భయ్యా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తల్లి పిల్లాడిని స్కూటీ డిక్కీలో కుక్కి సీటును మూసేస్తుంది. ఆ తర్వాత దర్జాగా వాహనం నడుపుకుంటూ వెళ్తుంది. కేవలం వ్యూస్, లైక్స్ కోసం పసిబిడ్డ ప్రాణాలను పణంగా పెట్టడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ ఘటనపై విచారణ చేయగా, సదరు సోషల్ మీడియా (Social Media) ఖాతాలో ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు మరెన్నో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అదే పిల్లాడిని ఒక సంచిలో పెట్టి తీసుకువెళ్లడం, బురద నీటిలో మహిళ పడుకోగా, ఆమెపై ఓ వ్యక్తి నడిచే వీడియో కూడా ఉంది. ఇలాంటి వీడియోలు పిల్లల భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, వైరల్ కంటెంట్ పేరుతో మైనర్లను ప్రమాదంలోకి నెట్టే క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

