కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, చుంచుపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక ఓ తల్లి, కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బాబుక్యాంప్నకు చెందిన రమ్య, తన భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది. తీవ్ర మానసిక వేదన, ఒంటరితనం ఆమెను వెంటాడాయి. తాను లేకపోతే కూతురి భవిష్యత్తు ఏమౌతుందోనన్న ఆందోళనతో కఠిన నిర్ణయం తీసుకుంది. గత నెల 28వ తేదీన ఎవరూ లేని సమయంలో మొదట కూతురికి విషం తాగించి, ఆ తర్వాత తానూ విషం సేవించింది.
సమయానికి గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న ఆ ఇద్దరినీ బ్రతికించేందుకు వైద్యులు శత విధాలా ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు, బంధువులు వారు కోలుకోవాలని ప్రార్థించారు. కానీ విధి కరుణించలేదు. చికిత్స పొందుతూ ఆదివారం నాడు పరిస్థితి పూర్తిగా విషమించి తల్లి రమ్యతో పాటు ఆమె కూతురు ఇద్దరూ కన్నుమూశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో బాబుక్యాంప్లో విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల రోదనలు మిన్నంటాయి.
భర్త మరణం తట్టుకోలేక.. కూతురితో కలిసి మహిళ ఆత్మహత్య

