కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు (Moinabad Drugs Case) లో దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. ఈ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన బిజినెస్మెన్ నమిత్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో తాజాగా నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
దీంతో మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మల రిమాండ్ ను ఏప్రిల్ 8 వరకు కోర్టు పొడిగించింది. విచారణ సందర్భంగా రిమాండ్ లో పోలీసులు మిమ్మల్ని వేధించారా? అని నిందితులను ప్రశ్నించారు. అయితే అలా ఏమీ చేయలేదని రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలు జవాబిచ్చారు. కోర్టు తీర్పు అనంతరం వారిని పోలీసులు మళ్లీ రిమాండ్ కు తీసుకున్నారు.
కాగా, ఈనెల 14వ తేదీన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని వచ్చిన పక్కా సమాచారంతో మొయినాబాద్ పోలీసులతో కలిసి తెలంగాణ ఈగల్ టీమ్ సంయుక్తంగా దాడి చేసింది. ఈ దాడుల్లో డ్రగ్స్తో పాటు పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ దాడుల సమయంలో పోలీసులు, అధికారులపైకి నమిత్ శర్మ కాల్పులు జరపడం సంచలనంగా మారింది. పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం నిందితులను రిమాండ్ లోకి తీసుకున్న పోలీసులు.. డ్రగ్స్ సరఫరాదారుల వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

