కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. సీఎంతో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ తో శాసనమండలి హాల్లో గురువారం గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో 0-10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం.. విద్యాభ్యాసన స్థాయి సామర్థ్యలోపాలకు సంబంధించి పలు నివేదికలను కార్తీక్ మురళీధరన్ సీఎం (CM Revanth Reddy) దృష్టికి తీసుకొచ్చారు. చిన్న వయస్సులో పోషకాహారం లోపంతో భవిష్యత్లో తలెత్తే ఆరోగ్య సమస్యలు.. ప్రాథమిక స్థాయిలో సరైన బోధనన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదనను తెలియజేశారు. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను మురళీధరన్ ముఖ్యమంత్రికి సూచించారు.
ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం వెల్లడించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు చెప్పారు. అంగన్వాడీల్లో కార్యకర్తలు, ఆయాలతో పాటు పోషకాహారం అందజేసేందుకు అదనంగా మరొకరిని నియమించాలని కార్తీక్ మురళీధరన్ కోరారు. కార్తీక్ మురళీధరన్ సూచించే అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. కార్తీక్ మురళీధరన్తో సమన్వయం చేసుకొని ఈ అంశంపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, సెర్ప్ సీఈవో దివ్య, డిప్యూటీ సీఎం కార్యదర్శి కృష్ణభాస్కర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.

