కలం, మహబూబ్ నగర్ బ్యూరో : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత విద్యను అభ్యసించిన రోజుల్లో లండన్లో నివసించిన చారిత్రక భవనాన్ని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ( Yennam Srinivas), జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ స్మృతి భవనంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితకాలంలో ఈ భవనంతో కలిగి ఉన్న అనుబంధానికి గుర్తుగా భారత ప్రభుత్వం ఈ భవనాన్ని కొనుగోలు చేసి ‘ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి భవన్ ’గా అభివృద్ధి చేసిందని తెలిపారు.
అంబేద్కర్ విద్యాభ్యాసం, ఆయన ఆలోచనా విధానం, సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటంతో ముడిపడి ఉన్న ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించడం ఎంతో గర్వంగా ఉందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి , అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. విద్యకు అంబేద్కర్ ఇచ్చిన ప్రాధాన్యత, జ్ఞానం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఆయన ఆలోచనలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించడంలో అంబేద్కర్ పోషించిన పాత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలను కాపాడుతూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

