కలం, కుమురం భీం ఆసిఫాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మార్లవాయిలోని హైమెండార్ఫ్ మ్యూజియాన్ని (Haimendorf Museum) సందర్శించి, ఆదివాసీ సమాజం కోసం విశేష సేవలందించిన ప్రొఫెసర్ క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ – హైమెండార్ఫ్, ఆయన సతీమణి ఎలిజబెత్ బెట్టీ హైమెండార్ఫ్ దంపతుల సేవలను స్మరించుకున్నారు.
ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను లోతుగా అధ్యయనం చేసి, వాటిని ప్రపంచానికి పరిచయం చేయడంలో హైమెండార్ఫ్ దంపతుల కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మార్లవాయి ఆదివాసీ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తోందని, ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు అన్నారు.

