కలం, నకిరేకల్ : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. నల్గొండ (Nalgonda) జిల్లా నకిరేకల్ (Nakrekal) మండలం తాటికల్, మంగళపల్లితో పాటు, కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రాల వద్ద ఉన్న రైతులతో స్వయంగా మాట్లాడి, వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని ఎమ్మెల్యే వీరేశం తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎవరైనా రైతుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినా.. దళారుల ప్రమేయం ఉన్నా సహించేది లేదని హెచ్చరించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి లేదా అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు కావాలనే రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జూన్ నెల వచ్చినా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేవి కావని విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షాన నిలబడి, పకడ్బందీగా కొనుగోళ్లు జరుపుతోందని గుర్తుచేశారు.

