కలం, నల్లగొండ బ్యూరో : చిట్యాల మార్కెట్ యార్డు (Chityal Market Yard) అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రూ.1.65 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల మార్కెట్ యార్డును మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గతంలో చిట్యాల మండలంలోని 11 గ్రామాలు చౌటుప్పల్ మార్కెట్ పరిధిలో ఉండటంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ గ్రామాలను చిట్యాల మార్కెట్ పరిధిలోకి విలీనం చేస్తూ జీవో జారీ చేసినట్లు వెల్లడించారు.
దీంతో రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే (Vemula Veeresham) పేర్కొన్నారు. ఇప్పటికే మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు తమ పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకునేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్నదాతలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ఆయన, మార్కెట్ యార్డులో (Chityal Market Yard) మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా రూ.1 కోటి వ్యయంతో ఆధునిక మార్కెట్ కార్యాలయ భవన నిర్మాణం, రూ.65 లక్షలతో యార్డు పరిసరాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Read Also: జాగృతి పోరాటాలతోనే మహిళా బిల్లు: కల్వకుంట్ల కవిత
Follow Us On: X(Twitter)

