కలం, మహబూబ్నగర్ బ్యూరో : దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్య రెడ్డి వర్మ అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి (MLA Tudi Megha Reddy) కొనియాడారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో భాగ్య రెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భాగ్య రెడ్డి వర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతికి అణగారిన వర్గాల శ్రేయస్సుకోసం భాగ్య రెడ్డి వర్మ కృషి చేశారన్నారు. బాల్య వివాహాలు, అంటరానితనం, దేవదాసి, జోగిని వ్యవస్థలను రూపు మాపేందుకు పోరాటం చేశారని కొనియాడారు. దళిత ఉద్యమ పితా మహుడిగా, సంఘ సంస్కకర్తగా భాగ్యరెడ్డి ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచారన్నారు. సమాజంలో దళితుల చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించాలన్నారు.
అనంతరం, కలెక్టర్ మాట్లాడుతూ మహానుభావుల జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. మహనీయుల చరిత్ర, త్యాగాలను బావి తరాలకు అందించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు, ప్రజల సంక్షేమం కోసం మహనీయులు ఆచరించిన మార్గాలను భావితరాలకు అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖిమ్యా నాయక్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాంజీ రావు, మహనీయుల ఉత్సవ కమిటీ ఛైర్మెన్ గంధం నాగరాజు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

