కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సారపాకలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదల కోసం ప్రభుత్వం ఇల్లు నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నప్పటికీ పనుల్లో ఆలస్యం ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. పేదలకు ప్రభుత్వ పథకాలు సమయానికి అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి టోకెన్ల ద్వారా ఇసుకను అందించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు తక్కువ ధరలో ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని, ‘జీరో ఇసుక దందా’ ను పూర్తిగా అరికట్టాలని ఎమ్మెల్యే (Payam Venkateswarlu) స్పష్టం చేశారు. టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జీరో ఇసుక దందాపై ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు.

