కలం, భువనగిరి: భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం వద్ద గల కెమికల్ ఫ్యాక్టరీలో ఇటీవల చోటుచేసుకున్న రియాక్టర్ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో చిన్నగూడెం గ్రామానికి చెందిన చెన్ను నాగిరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్పందించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి (MLA Kunduru Jayaveer Reddy) బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఫార్మా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి, మృతుడి కుటుంబానికి రూ. 2.9 కోట్ల భారీ పరిహారం అందేలా ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.
నాగిరెడ్డి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంలో ఆయన చూపిన చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం చిన్నగూడెంలోని నాగిరెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగిరెడ్డి అకాల మరణం అత్యంత విచారకరమని, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ తన పూర్తి సహకారం, అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు.

