కలం, ఖమ్మం బ్యూరో: పాలకుల నిర్లక్ష్యం వల్ల దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దెబ్బతిని నిరుద్యోగం పెరిగిపోతోందని, యువతను విస్మరిస్తే ఏ ప్రభుత్వాలకైనా పతనం ఖాయమని ఎమ్మెల్యే (MLA Kunamneni) కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కొదుమూరులో నిర్వహించిన అఖిల భారత యువజన సమాఖ్య 25వ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే వారిని “దిమాగి నక్సల్స్” అని ముద్ర వేసి నిర్బంధించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇది పాలకుల అసహనానికి నిదర్శనమని విమర్శించారు.
ఆలోచనలను, భావజాలాన్ని భౌతిక దాడులతో అంతమొందించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. యువత నిరంతరం అధ్యయనం చేస్తూ పోరాట మార్గాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర నేతలు వలివుల్లా ఖాద్రి, కల్లూరి ధర్మేంద్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐవైఎఫ్ నాయకులు దండి సురేష్, జమ్ముల జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

