కలం, మెదక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని డిజిటలైజేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి అంగన్వాడీ కార్యకర్తకు మొబైల్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. పటాన్ చెరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న 153 మంది కార్యకర్తలకు ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. మొబైల్ ఫోన్ల పంపిణీ పట్ల అంగన్వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

