కలం, జనగామ: జనగామ మున్సిపల్ (Jangaon Municipal) సాధారణ సమావేశం రసాభసగా మారింది. పట్టణ సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్ వేదిక.. రాజకీయ ఆధిపత్య పోరుకు, కుర్చీలాటలకు అడ్డాగా మారింది. పోడియం పైన వైస్ చైర్మన్కు సీటు కేటాయింపు విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి, కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.
అసలేం జరిగింది..?
మున్సిపల్ (Jangaon Municipal) కార్యాలయంలో గురువారం నిర్వహించిన సాధారణ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ కు పోడియం పై కుర్చీ సర్దుబాటు, పెద్ద రచ్చకు కారణమైంది. బిఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్కు, చైర్మన్ పక్కనే సీటు కేటాయించాలని ఆ పార్టీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. ప్రోటోకాల్ ప్రకారం పోడియం పైన కుర్చీ వేయలేమని తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు, సమావేశాన్ని అడ్డుకున్నారు.
ధర్నాకు దిగిన కౌన్సిలర్లు..
తమ డిమాండ్ నెరవేరకపోవడంతో బిఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో సీట్ల కోసం గొడవ పడటంతో సమావేశం గందరగోళానికి దారి తీసింది.
ప్రజల సమస్యల కన్నా కుర్చీలే ముఖ్యమా..?
కౌన్సిలర్ల తీరుపై స్థానిక ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. వార్డుల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల వంటి వందలాది సమస్యలు పెండింగ్లో ఉంటే.. వాటిని పరిష్కరించాల్సింది పోయి, కేవలం “ఎవరు ఎక్కడ కూర్చోవాలి” అనే దానికోసం గొడవపడటం సిగ్గుచేటని ప్రజలు విమర్శిస్తున్నారు. “ఓట్లు వేసి గెలిపించింది కుర్చీల కోసం కొట్టుకోవడానికి కాదు, మా కష్టాలు తీరుస్తారని. ఈ కౌన్సిలర్ల వైఖరి జనగామ ప్రజలను అవమానించడమే అని ప్రజలు వాపోతున్నారు

