కలం, వెబ్ డెస్క్ : ఇటీవల ఏపీలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. పెట్రోల్ నిల్వలు అయిపోయాయనే ప్రచారంతో ఇతర బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూలైన్లు కట్టి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో బంకు యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని.. ప్రభుత్వ వాహనాలకు , రాజధాని అమరావతిలో పనుల్లో భాగమైన వాహనాలకు మాత్రమే ఇంధనం సరఫరా చేస్తున్నారని ఏపీ హైకోర్టు (AP High Court)లో విజయవాడకు చెందిన కె. ఉమావల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లభ్యతపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం, చమురు కంపెనీలకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వాదన సందర్భంగా .. అమరావతి పనుల్లో భాగమైన వాహనాలకు మాత్రమే చమురు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలకు ఆధారాలేంటి? అని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా మెరుగుపడిందన్న హైకోర్టు.. వారం రోజుల పాటు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

