కలం, యాదగిరిగుట్ట : ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే సమాజంలో ఐక్యత పెంపొందుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) తెలిపారు. ఆదివారం యాదగిరిగుట్టలోని మున్నూరు కాపుసత్రం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య దంపతులు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయిలయ్య (MLA Beerla Ilaiah) మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే గొప్ప వేదికలని తెలిపారు. మున్నూరు కాపు సత్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో భారీ స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని, 108 మంది దంపతులతో హోమం,1008 మంది దంపతులతో కళ్యాణం నిర్వహించడం విశేషమని కొనియాడారు. ప్రజలందరికీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు లభించాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,భక్తులు భారీగా పాల్గొన్నారు.

